Cricketers : కోహ్లీపై వేటు వేసే సెలక్టర్ ఇంకా పుట్టలేదు…
NQ Staff - July 16, 2022 / 07:49 PM IST

Cricketers : ఒకప్పుడు అలవోకగా పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ ఇప్పుడు పాత ఫామ్ని అందుకోవడం కోసం నానా కష్టాలు పడుతున్నాడు. ‘రన్ మెషిన్.. ”కింగ్ కోహ్లి” అని పిలుచుకునే అతను ఇప్పుడు మాత్రం పరుగులు తీయడానికి నానాపాట్లు పడుతున్నాడు. ఒక దశలో సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకున్న కోహ్లి అప్పుడప్పుడు అర్థసెంచరీలతో మెరుస్తున్నా.. సెంచరీ మార్క్ను మాత్రం అందుకోలేక పోతున్నాడు.

cricketers Demanding Opportunities to Young Players
కోహ్లీకి ఏమైంది..!
చాలా రోజుల నుండి సెంచరీ కోసం నిరీక్షిస్తున్న విరాట్ కోహ్లీ.. గత కొన్ని సిరీస్లుగా పేలవ ఫామ్తో నిరాశపరుస్తున్నాడు. దాంతో.. భారత సెలెక్టర్లు కొన్ని రోజులు అతడ్ని పక్కనపెట్టి యువ ఆటగాళ్లకి అవకాశమివ్వాలని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. వెస్టిండీస్తో ఈ నెల చివర్లో జరగనున్న ఐదు టీ20ల సిరీస్కి ఇటీవల భారత టీ20 జట్టు ని ఎంపిక చేసిన భారత సెలెక్టర్లు.. అందులో కోహ్లీకి చోటివ్వలేదు.

cricketers Demanding Opportunities to Young Players
కొంత మంది అతనికి రెస్ట్ ఇచ్చారని చెప్తుండగా.. మరికొందరు వేటు వేశారని అభిప్రాయపడుతున్నారు. తన 14 ఏళ్ల కెరీర్లో గాయం కారణంగా విరాట్ కోహ్లీ ఆడని మ్యాచుల సంఖ్య నాలుగంటే నాలుగే. వరుసగా రెండు మ్యాచులకు దూరమైన సంఘటనలే లేవు. అలాంటిది బీసీసీఐతో విభేదాలున్నాయని వార్తలు వస్తున్న సమయంలో గాయం పేరు చెప్పి వరుసగా మ్యాచులకు దూరం కావడం పెను దుమారం రేపుతోంది.
ఇదే విషయంపై రషీద్ లతీఫ్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ‘‘విరాట్ కోహ్లీపై వేటు వేసే సెలెక్టర్ భారత్లో ఇంకా పుట్టలేదు’’ అని వ్యాఖ్యానించాడు. అతనే కాదు.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కూడా విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. కాగా, ఐపీఎల్ 2022 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తరఫున 16 మ్యాచ్లాడిన విరాట్ కోహ్లీ చేసిన పరుగులు 341 మాత్రమే. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉండగా.. మూడు మ్యాచ్ల్లో గోల్డెన్ డక్గా అతను వెనుదిరిగాడు. ఆ తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న కోహ్లీ.. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలోనూ నిరాశపరుస్తున్నాడు.