నిన్న మొన్నటిదాకా వైఎస్ కుటుంబం అంటే అందరికి ఒక రకమైన అభిప్రాయం ఉండేది. రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆ ఇంటి నుండి జగన్ వచ్చాడు, అందరు అతని వెనుకనే నడిచేవాళ్ళు అని, కానీ ఇప్పుడు పరిస్థితులు మెల్ల మెల్లగా అన్ని మారిపోతున్నాయి. ఎప్పుడైతే వైఎస్ షర్మిల తెలంగాణలో సరికొత్త రాజకీయ పార్టీ పెట్టబోతోంది అనే టాక్ వచ్చిందో అప్పటినుండి అన్న చెల్లాల మధ్య విభేదాలు ఉన్నట్లు బయట ప్రపంచటానికి తెలిసింది.
మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య… ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తుపై మారిన జగన్ వైఖరితో వివేకా కూతురు డాక్టర్ సునీత జగన్కు దూరంగా జరిగారు. తన తండ్రి హత్య కేసును దర్యాప్తు చేయాలంటూ ఆమె ఏకంగా సీబీఐని కోరడం, ఆ మధ్య ఏకంగా కేరళ అభయ హత్య కేసులో కీలకంగా వ్యవహరించిన సామాజిక కార్యకర్తతో భేటీ కావడం పెను సంచలనే అయ్యింది. దీనిపై జగన్ మౌనమే దాల్చగా… ఇప్పుడు తన తోడబుట్టిన సోదరి వైఎస్ షర్మిల కూడా జగన్కు దూరంగా జరిగినట్టుగా వస్తున్న వార్తలు మరింత కలకలం రేపుతున్నాయి.
తాజాగా సీఎం జగన్ తల్లి ఇంటి పెద్దయిన విజయమ్మ కూడా జగన్ కు దూరంగా ఉంటునట్లు వార్తలు వస్తున్నాయి. కొడుకును కాదని కూతురు వైపే విజయమ్మ రాబోతుందని తెలుస్తుంది. టీవల తమ బంధు వర్గానికి చెందిన ఓ వివాహ వేడుక హైదరాబాద్లో జరగగా… ఇంటి పెద్దగా విజయమ్మ హాజరు కాగా… ఆ వేడుకకు తల్లితో పాటు షర్మిల కూడా హాజరయ్యారు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ వివేకా కూతురు సునీత కూడా విజయమ్మ, షర్మిల పక్కన కనిపించారు. వేడుకలో వీరు ముగ్గురే కనిపించారు. జగన్గానీ, ఆయన సతీమణి భారతి గానీ అక్కడ కనిపించలేదు.
జగన్ జైలులో ఉండగా… తనదైన శైలిలో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన వైఎస్ షర్మిల… వైసీపీ పురిట్లోనే చావకుండా కాపాడారు. అందుకు ప్రతిఫలంగా షర్మిలకు పార్టీలో పెద్ద పదవే లభిస్తుందని అందరూ అంచనా వేశారు. జగన్ సీఎం అయ్యాక కూడా షర్మిలకు అటు పార్టీలో గానీ ఇటు ప్రభుత్వంలో గానీ ఎలాంటి పదవి వరించలేదు. దీంతో జగన్ తత్వం బోధపడిన షర్మిల… అన్నకు దూరంగా జరిగారు. ఏపీని వదిలేసి తెలంగాణ కేంద్రంగా రాజకీయం నెరపేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్న ఆమె ఇటీవలే సొంత పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగానే అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో జగన్, షర్మిలల మధ్య పూడ్చలేనంత అగాథం ఏర్పడిందన్న వాదనలు కలకలం రేపాయి.