Puvvada Ajay Kumar Vs YS Sharmila : పువ్వాడ అజయ్ వర్స్ వైఎస్ షర్మిల.! బస్తీ మే సవాల్.!
NQ Staff - June 19, 2022 / 07:04 PM IST

Puvvada Ajay Kumar Vs YS Sharmila : ఖమ్మం రాజకీయం వేడెక్కింది. తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వర్సెస్ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. బయ్యారం మైనింగ్లో షర్మిలకు వాటాలున్నాయనీ, తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని షర్మిల అడ్డంగా దోచుకున్నారనీ మంత్రి పువ్వాడ సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
మరోపక్క, ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వైఎస్ షర్మిల సన్నాహాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్సార్ అభిమానులు ఎక్కువగా వున్నారు. అక్కడ మత మార్పిడులు సహా, అనేక కారణాలతో వైఎస్ షర్మిలకు అనుకూలంగా బలమైన ఓటు బ్యాంకు వుంటుందనే ప్రచారం జరుగుతోంది.

Puvvada Ajay Kumar Vs YS Sharmila
మంత్రి పువ్వాడపై పెరుగుతున్న ఒత్తిడి..
జిల్లాకి చెందిన మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్, సొంత పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందేమోనన్న ఆందోళనతో వున్నట్టున్నారు. మంత్రి హోదాలో పార్టీ ప్రతిష్టను పెంచాల్సిన ఆవశ్యకత ఆయన మీదుంది. ఈ నేపథ్యంలోనే, షర్మిలపై విమర్శల విషయంలో పువ్వాడ అజయ్ కుమార్ ఒకింత అత్యుత్సాహం చూపక తప్పడంలేదు.
మరోపక్క, పువ్వాడ చేసిన ఆరోపణల్ని షర్మిల తిప్పి కొట్టారు. ‘బయ్యారం గనులతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయమై నా బిడ్డల మీద ప్రమాణం చేస్తాను.. పువ్వాడ అజయ్ కూడా అవినీతికి పాల్పడలేదంటూ ఆయన తన బిడ్డల మీద ప్రమాణం చేయగలరా.? ’ అని షర్మిల సవాల్ విసురుతున్నారు.పాలేరు నియోజకవర్గంలో బంపర్ మెజార్టీతో తాను గెలుస్తానని షర్మిల అంటున్నారు.