Nagababu : ఏపీలో కరెంట్ కోతలకు అల్లాడుతున్న ప్రజలు.. సంచలన కామెంట్స్ చేసిన నాగబాబు
NQ Staff - May 3, 2022 / 01:52 PM IST
Nagababu : ఎండాకాలం వచ్చిందంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్లో కరెంట్ కోతలతో జనాలు అల్లాడిపోతున్నారు. కొద్దిరోజులుగా అప్రకటిత విద్యుత్ కోతల దెబ్బకు నరకం అనుభవిస్తున్నారు. ఇంట్లో ఉక్కపోత.. బయటకు వస్తే దోమల మోతతో జాగారం చేస్తున్నారు. పసిపిల్లలు, పెద్దవాళ్లు ఉన్న ఇళ్లలో నరకం కనిపిస్తోంది. పసిబిడ్డలకు తల్లులు రాత్రంతా విసనకర్రతో విసరాల్సిన పరిస్థితులు. ఆస్పత్రుల్లో రోగులు కూడా కష్టాలు ఎదుర్కొంటున్నారు.
అవసరాన్ని బట్టి డిస్కమ్లు గ్రామీణ ప్రాంతాల్లో పగటిపూట 4 గంటల వరకు కరెంటు కోతలు విధిస్తున్నారు. ఇక, మున్సిపల్ ప్రాంతాల్లో రెండు గంటలపాటు విద్యుత్ కోత విధిస్తున్నారు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో కరెంట్ కోతలు విధిస్తున్నారు.
అయితే ఈ పవర్ కట్స్ చెబుతున్న సమయం కన్నా ఎక్కువగానే ఉంటున్నాయి. గ్రామాలు, పట్టణాల అన్న తేడా లేకుండా ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. కొన్ని సమయాల్లో రాత్రిపూట కూడా కరెంటు కోతలు విధిస్తున్నారు.
ఈ వ్యవహారంపై నాగబాబు స్పందించారు. ఈ మధ్య కాలలో జనసేన పార్టీలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా ఏపీలో తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. అంతేకాదు నాగబాబు ఇన్స్టాలో ‘Just Ask Me’.. Anything & Everything పేరుతో పార్టీ కేడర్, అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇటీవల తెలంగాణ మంత్రి చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు.
అయితే ప్రస్తుతం కరెంట్ పరిస్థితుల గురంచి జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు మండిపడ్డారు. విద్యుత్ సంక్షోభం అధిగమించేందుకు జనసేనకు ప్రణాళిక ఉందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉత్పాదక కొరత కారణం చూపి గత నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సహకార రంగంలోని ఆరు చక్కెర కర్మాగారాలు మూసేశారని వెల్లడించారు.
ఆస్తుల అమ్మకానికి జీవో నెంబర్ 15 ను జారీ చేసారు.. ఫలితంగా వందలాది మంది కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇప్పుడు విద్యుత్ కొరత పేరుతో పరిశ్రమలు మూసేస్తే కార్మికుల ఉపాధి కోల్పోతారని వివరించారు.