ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అంటేనే రసవత్తకమైన పోరు జరుగుతున్నట్లు లెక్క, అధికార పక్షము, ప్రతిపక్షము మధ్య మాటలు తూటాలు పేలుతుంటాయి. కౌంటర్ లు ప్రతి కౌంటర్ లతో అసెంబ్లీ మార్మోగిపోతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలైయ్యాయంటే చాలు అందరి దృష్టి అటు వైపే ఉంటుంది. తాజాగా మొదలైన అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే అలాంటి మాటల తూటాలు పేలాయి.
బీఏసీ సమావేశం తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. డిసెంబర్ 4 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే దీనిపై ప్రతిపక్షము టీడీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కనీసం పదిహేను పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది.
దీనిపై మంత్రి కొడాలి నాని లోకేష్ బాబును, చంద్రబాబు ను ఉద్దేశించి అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులు సరిపోకపోతే చంద్రబాబు, లోకేష్.. జూమ్ మీటింగ్ పెట్టుకోవాలని కొడాలి నాని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐదు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించటం సరిపోతుందని సభలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కొడాలి నాని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో మంత్రి పేర్ని నానిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ‘మా భద్రత కన్నా ప్రజల భద్రతే మాకు ముఖ్యం. పేర్ని నాని ఎన్నడూ ప్రజల్లోనే, ప్రజల మనిషిగా తిరుగుతున్నార’ని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.
అదే విధంగా ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామాను మండలి ఛైర్మన్ షరీఫ్ ఆమోదించారు. శాసన మండలి సభ్యత్వానికి గత నెలలో సునీత తెలిపారు. రాజీనామా చేసి, లేఖను చైర్మన్కు పంపించారు. టీడీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు ఆమె అప్పట్లో తెలిపారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు విఫలం అయ్యారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాలకు మేలు చేస్తున్నారని, అందుకే ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు సునీత చెప్పారు.