Praja Sangrama Yatra : ఖరారైన నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్, ఇదే రూట్ ప్లాన్
NQ Staff - September 5, 2022 / 10:53 AM IST

Praja Sangrama Yatra : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టనున్న 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. 9 అసెంబ్లీ నియోజకవర్గాలు, 115.3 కి.మీటర్ల మేర పదిరోజుల పాటు సాగనుందీ పాదయాత్ర.

Finalized Fourth Phase Praja Sangrama Yatra Schedule
12న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రారంభమై 22న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ముగియనుంది. అయితే ఈనెల 17న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవాలకు హాజరుకానున్న నేపథ్యంలో ఆ రోజు పాదయాత్రకు విరామం ప్రకటించారు.
ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. ఈ తాజా షెడ్యూల్ తో బీజేపీ శ్రేణుల్లో, పార్టీ కార్యకర్తల్లో కొత్త జోష్ నిండినట్టయింది.
బండి సంజయ్ నిర్వహించిన గత మూడు విడతల పాదయాత్రలకి ప్రజలనుంచి మంచి స్పందన వచ్చింది. పార్టీ బలోపేతానికి, బీజేపీ సిద్ధాంతాలతో పాటు అధికార పార్టీ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బాగా దోహదపడింది. దాంతో ఈ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్రని కూడా మరింత విజయవంతం చేసే పనుల్లో ఉన్నారు పార్టీ లీడర్లు, అభిమానులు.