చిన్ననాటి ప్రేమ కోసం భర్తని చంపించిన మహిళ
Samsthi 2210 - July 31, 2021 / 03:24 PM IST
అక్రమ సంబంధాల వలన ఏ పాపం ఎరుగని భర్తలు తనువు చాలిస్తున్నారు. మంచి భార్య దొరికింది కదా, ఇక జీవితాంతం ఆమెతో సంతోషంగా ఉండొచ్చు అనుకుంటున్న మగాళ్లకు కొందరు మహిళలు భూమిపై నూకలు లేకుండా చేస్తున్నారు. రీసెంట్గా ఓ మహిళ ప్రియుడి కోసం భర్తని చంపిచింది. ఈ ఘటన మరవకముందే అలాంటి సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. చిన్ననాటి ప్రేమ కోసం కట్టుకున్నవాడిని భూమిపై లేకండా చేసింది.
రెండు రోజుల క్రితం విశాఖ మధురవాడలోని దుర్గా నగర్లో రాత్రి వాకింగ్ చేసి వస్తున్న సతీష్ అనే వ్యక్తి తలపై రాడ్డుతో కొట్టి హత్య చేశారు. ఆ సమయంలో అతని భార్య రమ్య, పిల్లలు కూడా ఆరడుగుల దూరంలో ఉన్నారు. రక్తపు మడుగులో ఉన్న భర్తని ఆసుపత్రికి తరలించిన అతను చావుని తప్పించుకోలేకపోయాడు. సతీష్ మృతి చెందాడని వైద్యులు చెప్పడంతో భార్య రమ్య పోలీసులకు విషయాన్ని చేరవేసింది.
రంగంలోకి దిగిన పోలీసులకు సంచలన విషయాలు తెలిసాయి. డాగ్ స్వాడ్, క్లూస్టీం తో ఆధారాలు సేకరించిన పోలీసులు భార్యని కూడా విచారించారు. తన భర్తపై దాడి జరుగుతున్న సమయంలో ఆరడుగుల దూరంలో ఉన్నానని చెప్పడం, ఆమె కొంచెం కూడా ప్రతిఘటించకపోవడంతో పోలీసులకి అనుమానం వచ్చి ఆమెను మరింత లోతుగా విచారించారు.
తన భర్త ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి వేరే వ్యక్తితో గొడవలు ఉన్నాయని చెప్పి పోలీసులను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసింది. హత్యకు రెండు రోజుల మందు ప్రియుడు షేక్ బాషాతో కలిసి రమ్య సీసీ కెమెరాలు లేకుండా నిర్మానుష్యంగా ఉండే ప్రదేశం గురించి ఆరాలు తీసింది. పక్కా ప్రణాళికతో భర్తను మట్టుపెట్టింది.
నిందితులిద్దరు చిన్ననాటి స్నేహితులుగా ఉంటూ ప్రేమ వ్యవహారం నడిపారని, చాలా ఏళ్ల తర్వాత పదో తరగతి స్నేహితుల వాట్సాప్ గ్రూప్ ద్వారా తిరిగి ఒక్కటయ్యారని డీజీపీ పేర్కొన్నారు. వీరికి రమ్య భర్త అడ్డుగా ఉన్నాడని తెలిసి ఆయన అడ్డును తొలగించేందుకు భాషా పథకం ప్రకారం హత్యకు పాల్పడ్డాడు. నిందితులని రిమాండ్కు తరలించినట్టు డీజీపీ స్పష్టం చేశారు.