YCP: పీకే చూపిన బాటలో: వైసీపీ – కాంగ్రెస్ పొత్తు ఖాయమే.!
NQ Staff - April 22, 2022 / 11:31 AM IST
YCP: కాంగ్రెస్ పార్టీతో విభేదించి, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి, కాంగ్రెస్ పార్టీని తెలుగు రాష్ట్రాల్లో లేకుండా చేయడంలో తనవంతు కృషి చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తిరిగి కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశం వుంటుందా.?
ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. 2024 ఎన్నికల్లో బీజేపీ గనుక తిరిగి కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనే అంచనాకి వస్తే, అప్పుడు ప్రత్యేక హోదా కోసమో, ఇంకో కారణంతోనో కాంగ్రెస్ పార్టీతో జత కట్టడానికి వైసీపీకి పెద్దగా అభ్యంతరాలు వుండకపోవచ్చు.
పైగా, వైఎస్సార్సీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ పార్టీలో చేరితే.. వైసీపీ కూడా కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షమైపోతుంది. ఎందుకంటే, ప్రశాంత్ కిషోర్ ఎంత చెబితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అంత. పీకే గీసిన గీత దాటే రిస్క్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేయకపోవచ్చు.
కానీ, ప్రస్తుతం బీజేపీతో వైసీపీకి తెరవెనుకాల ‘అవగాహన’ వుంది. ఒకవేళ బీజేపీని కాదని వైసీపీ గనుక కాంగ్రెస్ పార్టీతో వెళితే, రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయో ఏమో.! ఈ విషయమై వైసీపీ వర్గాల్లోనూ లోతైన చర్చ జరుగుతోంది. వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్తో కలవబోదన్నది వైసీపీ నేతలు ప్రస్తుతం గట్టిగానే చెబుతున్నప్పటికీ, ఏమో, తెరవెనుకాల రాజకీయం ఎలాగైనా మారిపోవచ్చు.
వైసీపీ – కాంగ్రెస్ల పొత్తు విషయమై కొద్ది నెలల్లోనే స్పష్టత వచ్చే అవకాశం వుందన్న ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే.