Pawan Kalyan : దత్తత రాజకీయం: జనసేనాని సంచలన ప్రకటన చేస్తారా.?
NQ Staff - June 18, 2022 / 08:44 AM IST
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈ నెల 19న పర్చూరులో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోయిన కౌలు రైతు కుటుంబాల్ని ఆదుకునేందుకు జనసేన పార్టీ ఓ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నిధికి భారీ విరాళాన్ని ఇచ్చారు. మెగా కుటుంబం నుంచి పలువురు ఈ నిధికి ప్రత్యేకంగా విరాళాలు అందించిన సంగతి తెలిసిందే.
కాగా, ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన జనసేనాని, పర్చూరులో కూడా పలువురు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తారు. అయితే, ఈ వేదిక ద్వారా జనసేన అధినేత సంచలన ప్రకటన లేదా సవాల్ చేస్తారన్నది జనసేన వర్గాల నుంచి అందుతోన్న సమాచారం.
దత్తత రాజకీయం.! ఇది వేరే లెవల్.!
ప్రభుత్వం రైతులందర్నీ ఆదుకుంటోందనీ, సాయం అందని రైతులెక్కడున్నారో విపక్షాలు చెప్పాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరిన దరిమిలా, ఆ సవాల్ని స్వీకరించిన జనసేన ఇప్పటికే, ‘ముఖ్యమంత్రిగారూ మా కాన్వాయ్ పంపిస్తాం.. మీరు పర్చూరుకి రండి.. పవన్ కళ్యాణ్ పాల్గొనే కార్యక్రమంలో మీరూ పాల్గొని, మీరు సాయం చెయ్యని కౌలు రైతులెవరో తెలుసుకోండి..’ అని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో జనసేనాని నుంచి కూడా అంతకు మించిన స్థాయిలో ముఖ్యమంత్రికి ఓ సవాల్ విసురుతారనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో, త్వరలో తిరుపతి నుంచి రాష్ట్ర పర్యటనలు చేపట్టనున్న జనసేనాని, ఓ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాలు మరింత హాటుగా మారతాయన్నది నిర్వివాదాంశం.