Pawan Kalyan : ఒక్కమాటతో 2024 ఎన్నికల వేడి పెంచేసిన జగన్, బాబు, పవన్
NQ Staff - November 17, 2022 / 09:20 AM IST

Pawan Kalyan : ఏపీ రాజకీయాల్లో వేడి రాజుకుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు అయిన వైకాపా, తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
అధికార పార్టీ వైకాపా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల పార్టీ నాయకులతో మాట్లాడుతూ ఈ ఒక్క ఎలక్షన్ మనం గెలవగలిగితే మరో 30 సంవత్సరాల పాటు అధికారంలో మనమే ఉంటాం అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు.
ఆ వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక సమావేశంలో మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో చూపిస్తాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇక నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మీరు నన్ను ఈసారి గెలిపించక పోతే ఇదే నా చివరి ఎన్నిక అవుతుంది. కౌరవ సభకు గౌరవం తీసుకొస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
మొత్తానికి ఈ ముగ్గురు అధినేతలు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఎన్నికలు సంవత్సరానికి పైగానే ఉన్నప్పటికీ ఎన్నికల హడావుడి రాష్ట్రంలో కనిపిస్తోంది.
ఈ ముగ్గురు నేతలు ఒకే ఒక్క మాటతో ఏపీ రాజకీయాలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అధినేతల మాటలతో పార్టీ కేడర్లు మరింత ఉత్సాహం కనిపిస్తోంది. మొత్తానికి 2024 ఎన్నికల హడావుడి మొదలైనట్లుగానే ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పరిస్థితిని చూస్తుంటే అనిపిస్తోంది.