Cricket: రవిశాస్త్రి తర్వాత టీమిండియా కోచ్ పదవి ఎవరికి దక్కుతుందో తెలుసా?
Tech Sai Chandu - September 14, 2021 / 07:49 PM IST
Cricket: భారత క్రికెట్ టీంతో పాటు సపోర్టింగ్ స్టాఫ్కి సంబంధించి పలు మార్పులు జరగనున్నాయి అనే వార్తలు కొద్ది రోజులుగా హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమ్ ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి , అతడి టీమ్ భరత్ అరుణ్, ఏ. శ్రీధర్, విక్రమ్ రాథోడ్ల పదవీ కాలం టీ20 వరల్డ్ కప్ తర్వాత ముగియనుంది. రవిశాస్త్రికి ఇప్పటికే ఒకసారి పదవీ కాలం పొడిగించారు. దీంతో బీసీసీఐ సీనియర్ జట్టు కోసం కొత్త కోచింగ్ టీమ్ను ఎంపిక చేసే అవకాశం ఉన్నది.
టీ20 వరల్డ్కప్ 2021 తర్వాత రవిశాస్త్రి గడువు ముగియనుండడంతో తాత్కాలిక కోచ్గా రాహుల్ ద్రావిడ్ని తీసుకోవాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం జట్టులో ఉన్న యువకులు చాలా మంది ద్రావిడ్ శిక్షణలో రాటు తేలిన వారే కావడంతో అతడికి హెడ్ కోచ్ పదవి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
భారత జట్టు బెంచ్ ఇంత పటిష్టంగా ఉండటం వెనుక ద్రావిడ్ కృషి అమోఘమని.. రాబోయే రెండేళ్లు ఇండియన్ క్రికెట్కు చాలా కీలకం కాబట్టి తప్పకుండా ద్రవిడ్కు హెచ్ కోచ్ పదవి ఇవ్వాలని క్రికెట్ నిపుణులు కూడా చెబుతున్నారు. ద్రవిడ్ని తాత్కాలిక కోచ్గానే నియమిస్తారా లేదంటే పూర్తి స్థాయి కోచ్గా నియమిస్తారా అనేది రానున్న రోజులలో తెలియనుంది.
ఎన్సీఏ డైరెక్టర్గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన రాహుల్ ద్రావిడ్, టీమిండియా హెడ్కోచ్గా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకోవడానికి సుముఖంగా లేనట్టు తెలుస్తోంది…అయితే రవిశాస్త్రి పదవీకాలం ముగిసిన తర్వాత కొత్త హెడ్కోచ్ నియామకం జరిగే వరకూ టీమిండియాకి తాత్కాలిక కోచ్గా రాహుల్ ద్రావిడ్ వ్యవహరించబోతున్నట్టు సమాచారం.
టీ20 సిరీస్ ముగిసిన తర్వాత నవంబర్లో న్యూజిలాండ్తో స్వదేశంలో రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచులు ఆడనుంది టీమిండియా… ఈ సిరీస్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా పర్యటనకు బయలుదేరుతుంది. సౌతాఫ్రికా పర్యటన సమయానికి కోచ్ ఎంపిక పూర్తవుతుందని సమాచారం.