Dil Raju : ఇటీవలి కాలంలో చాలా చిత్రాలు వచ్చిన దానికన్నా ఎక్కువ కలెక్షన్స్ చూపిస్తూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారనే ప్రచారం నడుస్తుంది. ఈ విషయంపై తాజాగా దిల్ రాజు స్పందించారు. ఈ మధ్య కాలంలో రిలీజైన పెద్ద సినిమాలలో దాదాపుగా అన్ని సినిమాలకు దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. అయితే దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాలకు సంబంధించి నైజాం ఏరియాలో ఫేక్ కలెక్షన్లు ప్రచారంలోకి వస్తున్నాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
ఈ కామెంట్ల గురించి దిల్ రాజు స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వైరల్ అయిన ఫేక్ కలెక్షన్లకు, తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన అన్నారు. తాను డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన సినిమాల కలెక్షన్లను బయటకు వెల్లడించడం కూడా సరికాదని ఆయన అన్నారు. ఫేక్ కలెక్షన్ల వల్ల ఫ్యాన్స్ కు ఒక అరగంట ఆనందం ఉంటుందని అంతకు మించి ఒరిగేదేమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు.
నిర్మాతలు, హీరోలు కోరడం వల్లే టికెట్ రెట్లు పెంచుతున్నాం తప్ప అంతకు మించి మరే కారణం లేదని ఆయన చెప్పుకొచ్చారు. కేజీఎఫ్2 సినిమాకు నిర్మాతలే టికెట్ రేట్లు పెంచాలని కోరారని ఏపీలో కూడా టికెట్ రేట్లు పెంచాలని కోరినా వీలు కాలేదని ఆయన అన్నారు. ఎఫ్3 సినిమాను నార్మల్ రేట్లతో విడుదల చేయాలని రెండు నెలల క్రితమే నిర్ణయం తీసుకున్నానని దిల్ రాజు చెప్పారు.

దిల్ రాజు కామెంట్ల వల్ల నైజాంలో పెద్ద సినిమాల కలెక్షన్లు ఫేక్ అని చాలామంది భావిస్తున్నారు. అయితే ఈ కామెంట్లకు సంబంధించి ఇతర నిర్మాతల స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. ఎఫ్3 సినిమా సాధారణ రేట్లతో విడుదలై సక్సెస్ సాధిస్తే భవిష్యత్తులో పెద్ద సినిమాలు తక్కువ రేట్లతో థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
- Advertisement -
వరుణ్ తేజ్, వెంకటేష్, మెహ్రీన్, తమన్నా, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రలలో అనీల్ రావిపూడి ఎఫ్ 3 చిత్రం తెరకెక్కించగా, ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. మే 27న చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.