Chiranjeevi : కోట్లు ఖర్చు అయిన సరే.. వచ్చే బర్త్ డే నాటికి సినీ కార్మికుల కోసం ఆసుపత్రి నిర్మిస్తానన్న చిరంజీవి
NQ Staff - August 20, 2022 / 08:25 AM IST

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి కష్టం విలువ తెలుసు. స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి ఇప్పుడు కోట్లు సంపాదించాడు. అయినప్పటికీ కష్టాలు తెలుసు. అందుకే ఆపదలో ఉన్నవారికి తన వంతు సాయం చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే సినీ కార్మికుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న చిరంజీవి చిత్రపురి కాలనీలోని పేద సినీ కార్మికుల కోసం 10 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు చెప్పారు.

Chiranjeevi about chitrapuri colony hospital
కోట్ల ఖర్చుతో ఆసుపత్రి..
కొణిదెల వెంకట్రావు పేరుతో నిర్మించే ఈ ఆసుపత్రి తన వచ్చే పుట్టిన రోజు నాటికి అందుబాటులోకి తీసుకొస్తానని తెలిపారు. ఈ మేరకు క్రికెట్ కార్నివాల్ ఈవెంట్, జెర్సీ లాంచింగ్ కార్యక్రమంలో చిరంజీవి ఈ ప్రకటన చేశారు. పెద్ద ఆసుపత్రులకు వెళ్లే అంత ప్రాబ్లమ్ లేని వారి కోసం చిత్రపురి కాలనీలో ఆసుపత్రి ఉంటే బాగుండు అనిపించింది. చిత్రపురి కాలనీలో ఉండే సినీ కార్మికులందరికీ, బీపీఎల్ లోపు ఉన్న వారికి, రోజు కూలీ చేసే కార్మికులకు.. వీళ్లందరికీ ఉపయోగపడేలా ఆసుపత్రి ఉంటుందని అనుకున్నా.
చాలా కార్పొరేట్ ఆసుపత్రుల పెద్దలంతా నాకు స్నేహితులే. వాళ్లందరి సహకారంతో నేను కచ్చితంగా చేయగలను, ఇది చేస్తే కనుక ఉండే తృప్తి అంతా ఇంతా కాదని అనిపించింది. ఆ భావం రాగానే వెంటనే ప్లాన్ చేశాను. ప్లాన్ అయిన తర్వాత మొట్టమొదటగా చేయూత అందించిన టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ సోదరులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా నాన్న కొణిదెల వెంకట్రావ్ పేరు మీద ఆసుపత్రి నిర్మిస్తున్నా. ఈ బర్త్ డే మీకు మాట ఇస్తున్నా. వచ్చే బర్త్ డే నాటికి ఆసుపత్రిలో సేవలు ప్రారంభించేలా చూస్తాను.
ఆసుపత్రి నిర్మాణానికి ఎన్ని కోట్లు ఖర్చైనా సరే.. ఎవరైనా భాగస్వామ్యులు అవుతానన్నా సరే.. సంతోషంగా వారికి కూడా ఆ ఆనందం, అనుభూతి ఇస్తాను. లేదంటే మొత్తం ఖర్చు పెట్టుకునే శక్తి ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. మన ఎదుగుదలకు పరోక్షంగా, ప్రత్యక్షంగా కారణమైన మా వర్కర్లకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను” అని చిరంజీవి అన్నారు.
”సినిమా సక్సెస్ అయినప్పటి కంటే ఆపదలో ఉన్న వారికి ఆదుకున్నపుడు కలిగే సంతృప్తి చాలా గొప్పది. ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోతాం. ఉద్యమంలా బ్లడ్ బ్యాంక్ స్థాపించడానికి కారణమిదే. ఉన్నత విద్యలు అభ్యసించకపోయినా ఈరోజు మేము లక్షల్లో సంపాదిస్తున్నామంటే కారణం సినీ పరిశ్రమ. ప్రేక్షకులు మాకు ఆ అవకాశం కల్పించారు. అలాంటి వారికి ఎంతో కొంత మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. చిరంజీవి చేసే దానికి ప్రచారం అక్కర్లేదు. కానీ సమాచారం కావాలి కదా. సమాచారాన్ని చూసి పది మంది స్ఫూర్తి పొందుతారు. వారు ఇంకో పది మందికి సేవ చేసే అవకాశం ఉంటుంది. ఏ కార్యక్రమం చేసినా సరే పది మందికి తెలిసేలా చేస్తున్నా” అని చిరంజీవి అన్నారు.