మీసాల గీత దెబ్బకు చంద్రబాబు మూట ముల్లె సర్దుకోవాల్సిందేనా..?
Mamatha Reddy 1000 - December 8, 2020 / 02:04 PM IST
రోషానికి, పౌరుషానికి సింబాలిక్ గా మీసాన్ని చెప్తారు. కానీ.., ఇంటి పేరే మీసాల అయితే.., అందులో కూడా పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉంటే? వారి తెగింపు మాములుగా ఉంటుందా? విజయనగరం జిల్లా టీడీపీ మహిళా నేత, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత దూకుడు ప్రస్తుతం ఇలానే ఉంది. తన ఇంటి పేరుని నిలబెడుతూ.. బస్తీ మే సవాల్ అంటూ.. టీడీపీలో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైపోయారు మీసాల గీత.
రాచ కుటుంబానికి చుక్కలు
విజయనగరం జిల్లాల్లో తిరుగులేని రాచ కుటుంబానికి చుక్కలు చూపించిన ఘనత గీతాకే దక్కుతుంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున మీసాల గీత పోటీ పడి.., నాటి టీడీపీ అభ్యర్ధి అశోక్ గజపతిరాజుకు చుక్కలు చూపించారు. ఆ ఎన్నికల్లో ఈమె ఓడిపోయినా నియోజకవర్గంలో పట్టు దక్కించుకున్నారు. ముఖ్యంగా విజయనగరంలో అధికంగా ఉన్న కాపు ఓట్లు అన్నీ గీత దక్కించుకుంది. కాకుంటే విజయాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. తరువాత కాలంలో ప్రజా రాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది. తరువాత తనకి రాజకీయకంగా పాఠాలు నేర్పిన గురువు గంటా శ్రీనివాసరావుతో కలసి మీసాల గీత 2014లో టీడీపీలో చేరిపోయారు. పార్టీ మారినా.., విజయనగరం నియోజకవర్గంలో ఆమె పట్టు మాత్రం తగ్గలేదు. టీడీపీలోకి వచ్చిన తరువాత కూడా కాపులంతా మీసాల గీత వెంటే నడిచారు.
సిట్టింగ్ సీటు త్యాగం
దీనితో 2014లో విజయనగరం నియోజకవర్గం నుండి గీత ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ సమయంలో గీతకి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడానికి అశోక్ గజపతి రాజు లోక్ సభకు పోటీ చేయాల్సి వచ్చింది. కాకుంటే.., అప్పుడు గాలి టీడీపీ వైపు వీయడంతో ఈ ఎత్తులు అన్నీ ఫలించాయి. కానీ.., గత ఎన్నికల్లో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2019 ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు పట్టుబట్టి మరీ తన కుమార్తె అదితి గజపతిరాజుకు విజయనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు. కానీ.., జగన్ ఊపులో ఈమె విజయం సాధించలేకపోయింది.
టిడిపి కి వ్యతిరేకంగా పావులు
కానీ.., అశోక్ గజపతిరాజు కూతురు ఓటమి కోసం మీసాల గీత మద్దతుదారులు పనిచేశారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగింది. ఇక అతిది ఓడిన తరువాత పార్టీలో యాక్టీవ్ గా లేరు. దీనితో ఇప్పుడు నియోజకవర్గం ఇంచార్జి బాధ్యతలు తనకే వస్తాయని గీత ఎదురు చూశారు. ఇక్కడ కూడా అశోక్ గజపతిరాజు ఆమెకి అడ్డుపడుతున్నారన్న టాక్ ఉంది. చంద్రబాబు కూడా మీన మేషాలు లెక్క కడుతూ ఆలస్యం చేస్తు గీతని నియోజకవర్గం ఇంచార్జ్ గా నియమించలేదు. దీనితో.., విసిగిపోయిన మీసాల గీత వైసీపీలోకి వెళ్ళడానికి సిద్దమైందన్న టాక్ వినిపిస్తోంది. మీసాల గీత తీసుకున్న ఈ నిర్ణయంతో చంద్రబాబులో టెన్షన్ మొదలైందట. జిల్లా టీడీపీ నేతలు ఇప్పుడు ఆమెని బుజ్జగించే పనిలో పడినట్టు తెలుస్తోంది. బాబు కూడా ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడానికి అంగీకరించినట్టు సమాచారం. ఏదేమైనా ఓ మహిళ.. ఇద్దరు అగ్ర నేతలకి చెమటలు పట్టించడం అంటే మామూలు మాటలు కాదు కదా మరి!