వకీల్ సాబ్ న్యూ లుక్.. శృతితో బైక్ పై రయ్యిమంటూ వెళుతున్న పవన్
Samsthi 2210 - January 1, 2021 / 12:07 PM IST

2020లో కుదేలైన చిత్ర సీమ ఈ ఏడాది సరికొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలని భావిస్తుంది. ఇందులో భాగంగా క్రేజీ ప్రాజెక్ట్స్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి వారికి పసందైన వినోదం అందించాలని భావిస్తుంది. జనవరి నుండి బడా సినిమాలు థియేటర్స్కు క్యూ కట్టనుండగా, ఆ సినిమాలు చూసి ప్రేక్షకులు మైమరచిపోవడం ఖాయం అంటున్నారు. సంక్రాంతి కానుకగా క్రాక్, మాస్టర్, అల్లుడు అదుర్స్ వంటి చిత్రాలు విడుదల కానున్నాయి. మార్చిలో వకీల్ సాబ్, రాధే శ్యామ్ చిత్రాలు రిలీజ్ కానున్నట్టు టాక్. ఈ ఏడాది ఎలాంటి అవాంతరాలు లేకుంటే ప్రేక్షకుల వినోదంలో తడిసి ముద్దవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
న్యూ ఇయర్ కానుకగా పలు చిత్రాల నుండి సర్ప్రైజింగ్ లుక్స్ విడుదలయ్యాయి. రాధేశ్యామ్ నుండి ప్రభాస్ కూల్ లుక్తో పాటు వకీల్ సాబ్ నుండి పవన్, శృతి బైక్ పై వెళుతున్న ఫొటోని విడుదల చేశారు. న్యూ ఇయర్ కానుకగా విడుదలైన ఈ ఫొటో పవన్ అభిమానులని ఆకట్టుకుంటుంది. రెండేళ్ల తర్వాత పవన్ మళ్ళీ మేకప్ వేసుకొని వకీల్ సాబ్ చిత్రం చేయగా, ఈ సినిమా నుండి ఏ అప్డేట్ వచ్చిన అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ రీమేక్గా వకీల్ సాబ్ చిత్రం తెరకెక్కగా, ఈ చిత్రంకు సంబంధించిన టీజర్ను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.
వేణుశ్రీరామ్ దర్శకత్వలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ దర్శకుడిని హత్తుకున్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా వలన కరోనా వలన ఆగింది. మార్చిలో తప్పక రిలీజ్ చేస్తామని మేకర్స్ అంటున్నారు. ఇక పవన్ త్వరలో రానాతో కలిసి ‘అయ్యప్పునుమ్ కోషియుమ్’ రీమేక్ చేయనున్నాడు. ఈ సినిమాతో పాటు క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.