Tollywood: ముక్కోణపు పోరు కాదు.. హేమ కూడా పోటీకి సిద్ధమైంది..!
Samsthi 2210 - July 1, 2021 / 04:53 PM IST

Tollywood: సెప్టెంబర్లో జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సాధారణ ఎన్నికల కన్నా మరింత రసవత్తరంగా మారబోతున్నాయి. ముందు ప్రకాశ్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నట్టు ప్రకటించగా, ఆ తర్వాత మంచు విష్ణు ఫ్రేంలోకి వచ్చాడు. కృష్ణ, కృష్ణంరాజు వంటి సపోర్ట్తో విష్ణు బరిలోకి దిగబోతున్నాడు.
ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నరేష్ పదవీకాలం ముగుస్తుండటంతో టాలీవుడ్లో ఎలక్షన్ ఫీవర్ వచ్చి చేరింది. జీవిత రాజశేఖర్ కూడా తాను అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నట్టు నిన్న ప్రకటించింది. దీంతో త్రికోణ పోరు ఉంటుందని అందరు భావిస్తున్న క్రమంలో సీనియర్ నటి హేమ ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఫిలిం నగర్ సర్కిల్స్లో వాతావరణం మరింత రసవత్తరంగా మారింది.
ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో నన్ను సపోర్ట్ చేసిన వారందరి కోరిక మేరకు ఈసారి అధ్యక్ష పదవి కోసం పోటీకి దిగుతున్నానని హేమ తెలుపుతున్నారు. మాలో గత కొన్నేళ్లుగా `మా` ఉపాధ్యక్షురాలిగా, సంయుక్త కార్యదర్శిగా, ఈసీ సభ్యురాలిగా పదవులు చేపట్టాను. ఆ పదవులకు న్యాయం చేశాను. ఈసారి కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మా అసోసియేషన్ ఎన్నికలు రానే వచ్చాయి.
ట్రెజరర్ పదవికి పోటీ చేయాలని అనుకున్నా. కాని ఆలోచన మారింది. ప్రకాష్ రాజ్ గారు, మంచు విష్ణు బాబు, జీవితగారు పోటీ చేస్తున్నారని తెలిసి పెద్ద వివాదాలలో మనమెందుకు చిక్కుకోవాలి అనుకున్నాను. కాని సినీ ప్రముఖల నుండి ఒత్తిడి ఎదుర్కొన్నాను. నేను ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసినప్పుడు నా స్నేహితులు ముఖ్యంగా లేడీ సపోర్టర్స్, నన్ను మెజారిటీతో గెలిపించిన సినీ ప్రముఖులంతా ఫోన్ చేసి నువ్వెందుకు పోటీ చేయకూడదు.. నువ్వుంటే బాగుంటుంది.
ఎవరైనా కష్టాలు చెప్పుకోవాలన్నా అర్థరాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటావు.. అందుకే నువ్వు కావాలి అని అడుగుతున్నారు. నన్ను పోటీ చేయమని నా వాళ్లంతా ఒత్తిడి చేస్తున్నారు. ఇండిపెండెంట్గా పోటీ సమయంలో నాకు అండగా నిలిచిన వారందరికోసం, నా వారి కోసం మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్నాను..” అని తెలిపారు. అంటే ఈ సారి ఎన్నికలలో నలుగురు మధ్య భారీ పోటీ ఉండనుందని తెలుస్తుంది.