Radhe Shyam బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం సాహో కాగా, ఈ మూవీ ప్రేక్షకులని పెద్దగా అలరించలేకపోయింది. దీంతో ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా వలన చిత్ర విడుదల వాయిదా పడగా, సమ్మర్లో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం ఇటలీలోనే జరిగింది. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ 140 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించాయి. కరోనా టైంలోను ఇటలీకి వెళ్లి మరీ షూటింగ్ చేసిన రాధే శ్యామ్ చిత్ర బృందం రీసెంట్గా చిత్ర షూటింగ్ మొత్తం పూర్తి చేశారు.
రాధే శ్యామ్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో కనిపించనుండగా, పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో అలరించనుంది . ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు కనబడుతోంది. పూర్వ జన్మలో ‘రాధే శ్యామ్’ గా ఉన్న హీరో, హీరోయిన్లు.. మరుసటి జన్మలో ‘విక్రమదిత్యగా, ప్రేరణగా కనిపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. డియర్ కామ్రేడ్కు సంగతీతం అందించిన జస్టిన్ ప్రభాకరన్ ఈ మూవీకి బాణీలు సమకూరుస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. మూవీకి సంబంధించిన అప్డేట్ ఇవ్వాలని సోషల్ మీడియా ద్వారా దర్శకుడిని తెగ విసిగిస్తున్నారు.
ఫిబ్రవరి 14 లవర్స్ డే సందర్భంగా విక్రమాదిత్య, ప్రేరణలతో కూడిన తొలి వీడియో గ్లింప్స్ విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ గ్లింప్స్తో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు కానుండగా, ఇక వరుసగా పాటలు, టీజర్, ట్రైలర్ ఆ తర్వాత సినిమాను రిలీజ్ చేయనున్నారు . తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో రాధే శ్యామ్ విడుదల కానుంది. కాగా, ప్రస్తుతం ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాలలో ఒక మూవీ ఈ ఏడాది విడుదల కానుందని సమాచారం. రాధే శ్యామ్ ఈ ఏడాది రానుండగా, సలార్ ని కూడా ఇదే సంవత్సరం రిలీజ్ చేసి ఫ్యాన్స్కు డబుల్ బొనాంజా ఇవ్వాలని అనుకుంటున్నాడు ప్రభాస్.