Tirumala Brahmotsavam : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పరణ
NQ Staff - September 27, 2022 / 09:40 AM IST

Tirumala Brahmotsavam : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. రుత్వికులు, టీటీడీ అధికారులు, భక్త జన సందోహం మధ్య..శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీవారి సర్వ సైన్యాధక్షుడు విశ్వక్సేనుడు మాడవీధుల్లో ఊరేగారు. బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమల గిరులలో పండుగ వాతావరణం సంతరించుకుంది. రేపు సాయంత్రం 5.45 నుంచి 6:15 గంటల మద్య మీణాలగ్నంలో జరిగే ధ్వజారోహణంతో పూర్తిస్థాయిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలను
సమర్పించిన అనంతరం 9 గంటలకు వాహన సేవలు ప్రారంభమవుతాయి. పెద్దశేష వాహనంసేవతో ప్రారంభమై రోజుకు రెండు పూటలా స్వామివారు వివిధ వాహన సేవలపై దర్శనమిస్తారు. తొమ్మిది రోజుల పాటూ అంగరంగవైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంకు, తిరువీధుల్లో, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దేవతా మూర్తుల ప్రతిరూపాలు యాత్రికులను కనువిందు చేస్తున్నాయి. విద్యుత్ వెలుగుల మధ్య కొండపై బ్రహ్మోత్సవ సంబరాలు మొదలయ్యాయి.
సెప్టెంబర్ 27వ తేదీ మంగళవారం సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది. అదే రోజున తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.