Srivari Brahmotsavam : ఈనెల 26న తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పరణ
NQ Staff - September 25, 2022 / 05:55 PM IST

Srivari Brahmotsavam : తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం-పచ్చతోరణమే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావటంతో, ఇవి ‘బ్రహ్మోత్సవాలు’ అయ్యాయని అంటారు.తొమ్మిది రోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి బ్రహ్మోత్సవాలు అయ్యాయి.
ముస్తాబైన తిరుమల..
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పవిత్ర తిరుమల ముస్తాబవుతోంది. ఈ నెల 27, మంగళవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజులపాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీటికి ఈ నెల 26, సోమవారం అంకురార్పణ నిర్వహిస్తారు. సోమవారం రాత్రి 07:00 నుంచి 09:00 గంటల మధ్య బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు.
దాదాపు రెండేళ్ల తర్వాత ఈ స్థాయిలో, భక్తుల మధ్య బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజూ రెండు వాహనాలపై స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు.
ఈ నెల 27 మంగళవారం సాయంత్రం 05:45 నుంచి 06:15 మధ్య ధ్వజారోహణం జరుగుతుంది. రాత్రి 08:15 గంటలకు శ్రీవారికి ఏపీ సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 09:00-11:00 గంటల వరకు పెద్ద శేష వాహనంపై స్వామి వారు ఊరేగుతారు. సె
ప్టెంబర్ 28న ఉదయం 08-10 గంటల వరకు చిన్న శేష వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. మధ్యాహ్నం 01-03 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 07-09 గంటల వరకు హంస వాహనంపై స్వామి వారు విహరిస్తారు.
సెప్టెంబర్ 29న ఉదయం 08-10 గంటల వరకు సింహవాహనంపై, రాత్రి 07-09 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై, సెప్టెంబర్ 30న ఉదయం 08-10 గంటల వరకు కల్పవృక్ష వాహనంపై, రాత్రి 07-09 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామి వారు దర్శనమిస్తారు.
అక్టోబర్ 1న ఉదయం 08-10 గంటల వరకు మోహినీ అవతారంలో, రాత్రి 07-09 గంటల వరకు గరుడ వాహనంపై స్వామి వారు కనిపిస్తారు.
అక్టోబర్ 2న ఉదయం 08-10 గంటల వరకు హనుమంత వాహనంపై విహరిస్తారు. సాయంత్రం 04-05 గంటల వరకు రథరంగ డోలోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 07-09 గంటల వరకు గజ వాహనంపై ఊరేగిస్తారు.
అక్టోబర్ 3న ఉదయం 08-10 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతారు. మధ్యాహ్నం 01-03 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 07-09 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై వెంకన్న విహరిస్తారు.
అక్టోబర్ 4న ఉదయం 07 గంటలకు రథోత్సవం జరుగుతుంది. రాత్రి 07-09 గంటల వరకు అశ్వ వాహనంపై దర్శనమిస్తారు.
అక్టోబర్ 5న ఉదయం 06-09 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రి 09-10 గంటల వరకు ధ్వజావరోహణం జరుగుతుంది. చక్రస్నానంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఇప్పటికే తిరుమల క్షేత్రంలో సాలకట్ల బ్రహ్మోత్సవాల సందడి మొదలైంది. తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాల పేరిట స్వామివారే భక్తుల ముందుకు తరలివస్తారు.