Tirumala : తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
NQ Staff - September 27, 2022 / 10:22 PM IST

Tirumala : తెలుగు రాష్ట్రాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల కొండపై బ్రహ్మోత్సవాలకు అంకురార్పరణ జరిగింది.ఇవాళ్టి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు..
నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. కరోనా తరువాత తొలిసారి భక్తుల సమక్షంలో ఉత్సవాలు జరగనున్నాయి.బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. విద్యుత్ వెలుగుల్లో శ్రీవారి ఆలయం, రంగనాయకుల మండపం అలంకరించారు. సీఎం జగన్ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.
పట్టువస్త్రాలు సమర్పించనున్న జగన్..
రాత్రి 9 గంటలకు పెద్దశేషవాహన సేవలో సీఎం జగన్ పాల్గొననున్నారు. రాత్రికి తిరుమలలోని పద్మావతి వసతిగృహంలో సీఎం జగన్ బస చేయనున్నారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని సీఎం జగన్ దర్శించుకుంటారు.
సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు.
ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది. తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.