సీబీఐను రంగంలోకి దింపిన హైకోర్టు.. వైసీపీ సోల్జర్స్ గుండెల్లో రైళ్లు
Surya - November 16, 2020 / 07:00 PM IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కోర్టులకు మధ్యన కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలను తప్పుబట్టిన కోర్టులు కొన్నిటి మీద స్టేలు ఇవ్వగా ఇంకొన్నిటినీ మార్చుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఆదేశాలను నిర్లక్ష్యం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం మీద ధిక్కరణ చర్యలు తీసుకోవడానికి కూడ సిద్ధమైంది. కోర్టు తీర్పు ప్రతిపక్షం టీడీపీకి బాగా అక్కరకు వచ్చాయి. జగన్ చేస్తున్నదంతా రాజ్యాంగ విరుద్ధ పాలనని గోల గోల చేశాయి. దీంతో ప్రజల్లో వైసీపీ పాలన పట్ల ఒకింత అసహనం మొదలైంది. మరీ ఇన్నిసార్లు కోర్టులకు వెళ్లడం, మొట్టికాయలు వేయించుకోవడం ఏమిటని ముక్కున వేలేసుకున్నారు.
ఇది పాలకవర్గానికి పెద్ద పరాభవంలా అనిపించింది. హైకోర్టు తీర్పులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లినా కొన్ని అంశాల్లో వ్యతిరేక తీర్పులు వచ్చాయి. దీంతో చంద్రబాబు కోర్టులను మేనేజ్ చేస్తున్నారని, ప్రభుత్వానికి మోకాలడ్డుతున్నారని, జడ్జీలు కూడ చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారని అనుమానాలను వ్యక్తపరిచారు. నాయకులే అలా మాట్లాడేసరికి కార్యకర్తలు ఆగు తారా.. రెచ్చిపోయారు. కోర్టుల మీద, జడ్జీల మీద అనుచిత వ్యాఖ్యలు, బెదిరింపులు చేశారు. దీంతో ఆగ్రహించిన కోర్టు వారందరికీ నోటీసులు పంపింది.
కానీ ఎవరి మీదా సీఐడీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కోర్టు నోటీసులు పంపిందని తెలియగానే వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీటింగ్ పెట్టి మరీ కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కేసుల్లో ఇరుక్కున్నంత మాత్రాన కార్యకర్తను వదులుకోమని, వారికి అండగా ఉంటామని ఇచ్చారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు న్యాయస్థానం చెప్పినా పోలీసులు ఇప్పటికీ విపరీత వ్యాఖ్యలు చేసిన వారి మీద చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ఆగ్రహించింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది.
వెంటనే సీబీఐ రంగంలోకి దిగింది. సీఐడీ నమోదు చేసిన కేసులను పరిశీలించింది. హైకోర్టు ఆదేశాలతో 12 కేసులను సీబీఐ విశాఖలో రిజిస్టర్ చేసింది. అందరి మీదా ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. చూడబోయితే ఈ వ్యవహారాన్ని కోర్టు అంత సులువుగా వదిలేలా కనిపించట్లేదు. సీబీఐ రంగంలోకి దిగింది కాబట్టి వైసీపీ సోషల్ మీడియా సోల్జర్లకు గడ్డు కాలం తప్పేలా లేదు.